జిల్లా కేంద్రాల్లో ఏపీటీఎఫ్ మహాధర్నాలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:52 AM
విద్యారంగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు నిర్వహించింది.
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): విద్యారంగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు నిర్వహించింది. సమస్యలపై ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లభించకపోవడంతో ధర్నాలు చేపట్టినట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి తెలిపారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రస్థాయి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. 12వ పీఆర్సీకి వెంటనే కమిటీని నియమించాలని, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని, సరెండర్ లీవు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లకు బోధనేతర విధులు లేకుండా చేయాలని, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని కోరారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఈ డిమాండ్లకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలని, లేనిపక్షంలో రాష్ట్రస్థాయి ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరించారు.