రేపటి నుంచి ఆర్టీసీ రెండో దశ ఉద్యమం: ఆర్టీసీ జేఏసీ
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:39 AM
ఆర్టీసీలో విద్యుత్ బస్సుల నిర్వహణ, మూసేసిన డిపోల పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు..
విజయవాడ (బస్స్టేషన్), జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో విద్యుత్ బస్సుల నిర్వహణ, మూసేసిన డిపోల పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు రెండోదశ ఉద్యమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్రావు తెలిపారు. ఆర్టీసీ జేఏసీ వర్చువల్ సమావేశం ఆదివారం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం మూసేసిన నాలుగు డిపోలను వెంటనే పునరుద్ధరించాలని, ఇతర ప్రధాన సమస్యలతో కలిపి మొత్తం 30 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జూన్ 11న యాజమాన్యానికి అందజేసినట్లు తెలిపారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన డిమాండ్లపై ఈనెల 6, 7 తేదీల్లో, 9న గూగుల్ మీట్ ద్వారా సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (టీఆర్ అండ్ బీ) ఎంటీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాల సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ ఈడీలు, జేఏసీ నాయకుల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. స్పష్టమైన హామీలు రాకపోవటంతో రెండో దశ ఉద్యమాన్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.