ఇంటి వద్దకే కూరగాయలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:50 AM
ఇక నుంచి కూరగాయల కోసం రైతుబజార్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పట్టణప్రాంత వినియోగదారుల ఇళ్ల వద్దకే కూరగాయాలు డెలివరీ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లను....
‘డిజి రైతుబజార్ ఏపీ’ యాప్ ద్వారా సేవలు
ఇప్పటికే విశాఖ, బెజవాడ, కాకినాడ, గుంటూరు, తిరుపతిలో అందుబాటులోకి
త్వరలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లకూ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఇక నుంచి కూరగాయల కోసం రైతుబజార్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పట్టణప్రాంత వినియోగదారుల ఇళ్ల వద్దకే కూరగాయాలు డెలివరీ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లను డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ‘డిజి రైతుబజార్ ఏపీ’ యాప్ ద్వారా వినియోగదారుల ఇళ్ల వద్దకే కూరగాయలు అందించే విధానానికి ప్రస్తుతం ఐదు ప్రధాన నగరాల్లో విశేష స్పందన వస్తోంది. దీంతో రైతుబజార్ల వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెషింట్ సొల్యూషన్స్ లిమిటెడ్ సహకారంతో ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన కొత్త విధానం విజయవంతమైంది. ‘ఫ్రెష్ ఫ్రమ్ ఫార్మ్ టూ యువర్ డోర్’ విధానంలో పని చేసే డిజి రైతుబజార్ ఏపీ యాప్ను ఐదు ప్రధాన నగరాలకు చెందిన 21 వేలమంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. గతేడాది విశాఖపట్నంలో ప్రారంభించిన డిజి రైతుబజార్ కార్యకలాపాలను విజయవాడ, కాకినాడ, గుంటూరు, తిరుపతి నగరాలకు విస్తరించారు. గత డిసెంబరు నుంచి ఇప్పటి వరకు ఈ 5 నగరాల్లో 5,218 ఆర్డర్లు రాగా.. 1,21,465 కిలోల కూరగాయలను ఇళ్ల వద్దకు డెలివరీ చేశారు. రాష్ట్రంలో రైతుబజార్లు ఉన్న ఇతర నగరాలు, పట్టణాలకూ సేవలు విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 130 రైతుబజార్లు ఉన్నాయి. త్వరలో మరో 10 అందుబాటులోకి రానున్నాయి.