ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలి: బొప్పరాజు
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:10 AM
ప్రతి ఉద్యోగికి ఆర్థిక భద్రత కల్పించడతో పాటు, ఇతర హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
గుంటూరు(తూర్పు), జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఉద్యోగికి ఆర్థిక భద్రత కల్పించడతో పాటు, ఇతర హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం గుంటూరులో ఆదివారం నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సత్తెనపల్లి మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏపీజేఏసీ అమరావతి ఉద్దేశం కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఉద్యోగి చనిపోయినా ప్రభుత్వం ఆ ఉద్యోగికి ఎంత బకాయి ఉందో తెలియక వారి కుటుంబాలు రోడ్డున్న పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలకు సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని బొప్పరాజు పిలుపునిచ్చారు.