మద్యం స్కామ్ కేసులో షరతులతో బెయిల్ మంజూరు
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:21 AM
రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన అనుచరుడు చెరుకూరి వెంకటేశ్ నాయుడు, ఎస్పీ డిస్టిలరీస్ అధినేత సజ్జల శ్రీధర్రెడ్డిలకు హైకోర్టు గురువారం కఠినమైన ....
సజ్జల శ్రీధర్రెడ్డి, వెంకటేశ్ నాయుడికి కూడా..
అమరావతి, విజయవాడ, జనవరి 29(ఆంధ్రజ్యోతి) : రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన అనుచరుడు చెరుకూరి వెంకటేశ్ నాయుడు, ఎస్పీ డిస్టిలరీస్ అధినేత సజ్జల శ్రీధర్రెడ్డిలకు హైకోర్టు గురువారం కఠినమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం వారంతా విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చెవిరెడ్డికి స్వాగతం పలకడానికి వచ్చిన వైసీపీ శ్రేణులు జైలు వద్ద నానా హడావుడి చేశారు. పెద్దపెద్దగా నినాదాలు చేశారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా తనకు అరెస్టులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 72 కేసులు పెట్టారని, తనను అన్ని జైళ్లకు తిప్పారన్నారు.
ఇవీ బెయిల్ షరతులు..
ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలి. పాస్పోర్టులను ట్రయల్ కోర్టుకు స్వాధీనపరచాలి. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు. దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర హద్దులు దాటి వెళ్లడానికి వీల్లేదు. బెయిల్ పై విడుదలైన రెండు వారాల్లో తమకు వ్యక్తిగతంగా, ఉమ్మడిగా ఉన్న స్థిర-చరాస్తులు, బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ట్రయల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి.