Share News

ముస్లింలకు ఉచిత కార్పొరేట్‌ విద్య

ABN , Publish Date - May 07 , 2026 | 03:57 AM

ముస్లిం విద్యార్థుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో నూతన పథకాన్ని అమలు చేయనుంది.

ముస్లింలకు ఉచిత కార్పొరేట్‌ విద్య

  • ఏటా 500 మందికి ఇంటర్‌తోపాటు జేఈఈ, నీట్‌ శిక్షణ

  • 24న టాలెంట్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక

  • 12 వరకు దరఖాస్తుల స్వీకరణ: వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌

నెల్లూరు(హరనాథపురం), మే 6(ఆంధ్రజ్యోతి): ముస్లిం విద్యార్థుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో నూతన పథకాన్ని అమలు చేయనుంది. ఏటా 500 మంది విద్యార్థులను కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ చదివించటంతోపాటు జేఈఈ, నీట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. వక్ఫ్‌బోర్డు నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనున్నామని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ బుధవారం వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 24న మెరిట్‌ టెస్ట్‌ నిర్వహించి, ఆ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. 10వ తరగతిలో 75 శాతం మార్కులు సాధించి, ఏపీలో నివాసం ఉండి, తెల్లరేషన్‌కార్డు కలిగిన ముస్లిం విద్యార్థులు పథకానికి అర్హులని తెలిపారు. తాలిం-ఎ-హునర్‌(విద్యానైపుణ్యం)గా ఈ పథకానికి నామకరణం చేశారని చెప్పారు. ఈ పథకం కింద పూర్తిగా రెసిడెన్షియల్‌ శిక్షణ ఉంటుందన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై రూ.2 లక్షలు వ్యయం చేయనున్నట్టు వివరించారు.

Updated Date - May 07 , 2026 | 03:57 AM