నిర్మాణ దశలో రూ.6 వేల కోట్ల విద్యుత్తు ప్రాజెక్టులు
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:39 AM
ట్రాన్స్కో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6వేల కోట్లతో వివిధ విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు.
2 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ట్రాన్స్కో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6వేల కోట్లతో వివిధ విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్తు ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలో గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను ఉత్తమంగా తీర్చిదిద్దాలని, ఇప్పటికే ట్రాన్స్మిషన్ ఇబ్బందులను అధిగమించేందుకు పలు జిల్లాల్లో నూతన సబ్స్టేషన్లను పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ 2 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఆర్డీయే పరిధిలో అమరావతి రాజధాని పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ పనులనూ ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్తు శాఖ అధికారులుముందుకు సాగాలన్నారు. సమావేశంలో సీఎస్ విజయానంద్, ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్చంద్, ట్రాన్స్కో డైరెక్టర్లు పాల్గొన్నారు.