80 ఆసుపత్రుల్లో 83 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్లు
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:08 AM
రాష్ట్రంలోని 17 బోధన, 54 ఏరియా, 9 జిల్లా ఆసుపత్రుల్లో రూ.83 కోట్లతో కలుషిత జలాల శుద్ధి (ఎస్టీపీ) ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రి సత్యకుమార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
10 నెలల్లో పూర్తి చేయాలి: మంత్రి సత్య
సీసీ కెమెరాల పర్యవేక్షణలో బయోవ్యర్థాల సేకరణ
అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 17 బోధన, 54 ఏరియా, 9 జిల్లా ఆసుపత్రుల్లో రూ.83 కోట్లతో కలుషిత జలాల శుద్ధి (ఎస్టీపీ) ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రి సత్యకుమార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రుల్లో జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ (బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్), కలుషిత నీటి శుద్ధీకరణ అంశాలపై ఉన్నతాధికారులతో నివేదిక తెప్పించుకున్నారు. బోధనాసుపత్రులు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు కలుషిత జలాల శుద్ధి జరగకపోవడం లేదని తెలుసుకున్న ఆయన అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో నూజివీడు, బనగానపల్లి ఏరియా ఆసుపత్రుల్లో మాత్రమే కలుషిత జలాల శుద్ధి ప్లాంట్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. డీఎంఈ పరిధిలోని 40 బోధన, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో దాదాపు 17 చోట్ల ఎస్టీపీలు లేవని చెప్పారు. ఈ పరిస్థితి ఆమోదయోగ్యం కాదన్నారు. 80 ఆసుపత్రుల్లో ఎస్టీపీల ఏర్పాటుకు రూ.83 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పగా.. ఆయన వెంటనే నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. 10 నెలల్లో నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాకలు చేపట్టాలని ఆదేశించారు. బోధనాసుపత్రుల్లో 13 లక్షల కిలోల వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యర్థాల నిర్వహణలో కొన్ని లోపాలు గమనించామన్నారు. వ్యర్థాలను నిర్ణీత సమయంలో సేకరించి వేరు చేసి, నిర్దేశాల ప్రకారం వివిధ రకాల సంచుల్లో తరలించాలని, ఇందుకోసం ఆసుపత్రుల వారీగా పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా సీసీ టీవీల్లో నమోదయ్యేలా చూడాలని, బార్ కోడింగ్ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఆసుపత్రుల్లో రద్దీ తగ్గాలి
ప్రభుత్వాసుపత్రుల్లో అనవసర తాకిడిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సృష్టం చేశారు. మొదటి దశలో ఐసీయూ, ఇతర వార్డుల్లో రద్దీని తగ్గించాలని నిర్ణయించారు. నిర్ణీత వేళల్లో మాత్రమే సహాయకులు, సందర్శకులు ఉండేలా అనుమతించాలని, సిఫారసులను అంగీకరించవద్దని తెలిపారు. ఈ దిశగా అనంతపురం, విజయవాడ, శ్రీకాకుళం బోధనాసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టి ఫలితాలను మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. ఓపీ స్లిప్పులు పొందిన వారు మాత్రమే ఆసుపత్రుల ప్రాంగణంలో సంబంధిత చోట్లకు ప్రవేశించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనవసరంగా వచ్చే వారిని నియంత్రించాలని సూచించారు.