పీపీపీ విధానంలో ‘రిజిస్ట్రేషన్ సేవాకేంద్రాలు’
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:36 AM
కక్షిదారులకు మరింత పారదర్శకంగా, దళారుల బెడద లేకుండా రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం అల్లూరి సీతారామరాజు...
మహారాష్ట్ర తరహాలో మూడు నెలల్లో ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): ‘కక్షిదారులకు మరింత పారదర్శకంగా, దళారుల బెడద లేకుండా రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం అల్లూరి సీతారామరాజు, పోలవరం మినహా మిగిలిన 24 జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో పీపీపీ విధానంలో ‘రిజిస్ట్రేషన్ సేవాకేంద్రాలు’ ప్రారంభించనున్నాం’ అని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ అంబేడ్కర్ తెలిపారు. చిత్తూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరో మూడు నెలల్లో పైలట్ ప్రాజెక్టుగా అన్ని జిల్లాకేంద్రాల్లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ప్రారంభిస్తారని చెప్పారు. ప్రతి రిజిస్ట్రేషన్కు ఫీజు రూపేణా కక్షిదారులు రూ.2వేలు చెల్లించాలని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని జాయింట్-1 లేదా జాయింట్-2 సబ్రిజిస్ట్రార్లు సేవాకేంద్రానికి వచ్చే డాక్యుమెంట్లు సరైనవో, కావో పరిశీలించి, నిర్ధారించి ఆమోదం తెలిపాక రిజిస్ట్రేషన్ జరుగుతుందని వివరించారు. మహారాష్ట్రలోని అర్బన్ ప్రాంతాల్లో జూలై నుంచి ఎంపిక చేసినచోట్ల 30 చొప్పున రెండు విడతల్లో 60 మోడల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వమే ఈ సేవాకేంద్రాల తరహాలో సేవలు అందించనున్నట్లు చెప్పారు. అక్కడ ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు కక్షిదారుడు రూ.5,200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.