దేశంలో తొలి ‘ఏఐ పర్యాటక’ రాష్ట్రంగా ఏపీ
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:49 AM
దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చరిత్రాత్మక అడుగు వేశామని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.
ఎక్స్ప్లర్జర్ సంస్థతో పర్యాటక శాఖ ఎంవోయూ
విజయవాడ నుంచి వారాణసీ, కోల్కతాకు విమాన సర్వీసు
అమరావతి, విజయవాడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చరిత్రాత్మక అడుగు వేశామని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన ‘నివు ఏఐ’ ప్లాట్ఫామ్ వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో ఏఏఎల్ పద్మావతి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి కందుల దుర్గేశ్ ఒప్పందంపై సంతకం చేశారు.
ఆగస్టు 13 నుంచి విమాన సర్వీసులు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం ఆధ్యాత్మిక నగరమైన వారాణసీ, చారిత్రక నగరమైన కోల్కతాకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు మంత్రి దుర్గేశ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ను మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఆగస్టు 13 నుంచి ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో ప్రకటించిందన్నారు. వారానికి మూడు రోజులు(మంగళ, గురు, శనివారాలు) ఈ విమానాలు నడవనున్నట్టు తెలిపారు.