వచ్చే విద్యా సంవత్సరంలో 229 పనిదినాలు
ABN , Publish Date - May 02 , 2026 | 04:39 AM
వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల పనిదినాలు 229 రోజులు ఉండాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది..
సెలవులు 87... దసరాకు 10 రోజులు
ప్రాథమికంగా నిర్ణయించిన పాఠశాల విద్యాశాఖ
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల పనిదినాలు 229 రోజులు ఉండాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం 316 రోజుల్లో 229 పనిదినాలు, 87 సెలవులు ఉంటాయి. అక్టోబరు నెలలో అత్యధికంగా 15 రోజులు సెలవులు రానున్నాయి. దసరాకు అక్టోబరు 12 నుంచి 21 వరకు, సంక్రాంతికి జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఇస్తారు. పదో తరగతి పరీక్షలు మార్చిలో ఉంటాయి. ఎఫ్ఏ-1 పరీక్షలు ఆగస్టులో, ఎఫ్ఏ-2 అక్టోబరులో జరుగుతాయి. ఎస్ఏ-1 పరీక్షలు నవంబరులో, ఎస్ఏ-2 పరీక్షలు 2027 ఏప్రిల్లో నిర్వహిస్తారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అకడమిక్ క్యాలెండర్పైనే ప్రధానంగా చర్చించారు. అలాగే వచ్చే ఏడాది నుంచి అన్ని రకాల పరీక్షల మార్కులు ఆన్లైన్లో నమోదు చేసి, వాటిని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు.