అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:44 AM
సీఎంఆర్ కార్యకలాపాల్లో అవకతవకలకు పాల్పడుతున్న కొంతమంది మిల్లర్ల వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ వస్తోందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం సేకరణలో రాష్ట్రం అగ్రస్థానం: మంత్రి నాదెండ్ల
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ కార్యకలాపాల్లో అవకతవకలకు పాల్పడుతున్న కొంతమంది మిల్లర్ల వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ వస్తోందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులతో కుమ్మక్కై, ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్న మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ‘రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో ధాన్యం సేకరణ - వచ్చే ఖరీఫ్ సీజన్కు సన్నద్ధత’ అనే అంశంపై గురువారం విజయవాడలో మిల్లర్లు, రైతులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి వ్యవస్థను గాడిలో పెట్టిందన్నారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండటంతో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి, ధాన్యం అధికంగా పండించే పంజాబ్ వంటి రాష్ట్రాల కంటే ఏపీ ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు.