ఆ జిల్లాల డీఎన్ఏ కేసులు విశాఖ ఎఫ్ఎస్ఎల్కు!
ABN , Publish Date - May 19 , 2026 | 05:26 AM
రాష్ట్రంలో జరిగే నేరాలకు సంబంధించిన డీఎన్ఏ, సైబర్ కేసుల ఆనవాళ్ల పరిశీలన ఇకపై విశాఖపట్నంలోని రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో జరగబోతోంది.
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరిగే నేరాలకు సంబంధించిన డీఎన్ఏ, సైబర్ కేసుల ఆనవాళ్ల పరిశీలన ఇకపై విశాఖపట్నంలోని రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో జరగబోతోంది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్క్వార్టర్స్లో ఉండే ఏపీఎఫ్ఎస్ఎల్కు అన్ని ప్రాంతాల నుంచి డీఎన్ఏ పరీక్షలకు దర్యాప్తు అధికారులు శాంపిల్స్ పంపేవారు. వేగంగా నివేదికలు ఇచ్చేందుకు రీజినల్ ఎఫ్ఎస్ఎల్ కేంద్రాల్లో పరీక్షలు జరిపించాలని ఏపీ పోలీసు శాఖ నిర్ణయించింది. డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాలతోపాటు కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల డీఎన్ఏ పరీక్షలు మే 18 తర్వాత విశాఖలోని ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు ఏపీఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ పీహెచ్డీ రామక్రిష్ణ తెలిపారు. ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఇటీవల రూ.కోట్లు ఖర్చుచేసి తిరుపతి, విశాఖపట్నంలో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.