పోలీసుల కోసం విహార, విహారి వసతి భవనాలు
ABN , Publish Date - Aug 29 , 2026 | 06:18 AM
పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి శ్రేయస్సుకు రాష్ట్ర పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. ఇందులో భాగంగా అధికారిక విధులపై వివిధ జిల్లాల నుంచి మంగళగిరికి వచ్చే పోలీసు సిబ్బందికి..
ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్
మంగళగిరిలో శంకుస్థాపన చేసిన డీజీపీ గుప్తా
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి శ్రేయస్సుకు రాష్ట్ర పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. ఇందులో భాగంగా అధికారిక విధులపై వివిధ జిల్లాల నుంచి మంగళగిరికి వచ్చే పోలీసు సిబ్బందికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు 6వ బెటాలియన్ ఏపీఎస్పీ ప్రాంగణంలో పురుషుల కోసం ‘విహార’, మహిళల కోసం ‘విహారి’ పేరుతో ప్రత్యేక వసతి భవనాలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ నిర్మాణానికి డీజీపీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. విహార, విహారి సముదాయంలోని ఒక్కో భవనాన్ని సుమారు 13,603 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ఫ్లోర్తో పాటు రెండు అంతస్థులతో నిర్మించనున్నారు. రెండు భవనాల్లో చెరో 120 మంది బస చేసేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగ, ప్రస్తుతం 6వ బెటాలియన్ ఏపీఎస్పీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న పోలీస్ క్యాంటీన్, పెరుగుతున్న అవసరాలకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, సంక్షేమ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ విధానంలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ నిర్మిస్తున్నారు.