‘రైలు’ దొంగల కోసం ముమ్మర వేట!
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:45 AM
బాపట్ల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
బాపట్ల, జూన్ 16(ఆంధ్రజ్యోతి): బాపట్ల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకొనేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏఆర్ డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలకు ఈ బృందాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. రైల్వే పోలీసు విభాగం సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అదుపులోకి తీసుకున్న అనుమానితుడు ఇచ్చిన సమాచారంతో మరో రెండు బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లనున్నట్లు సమాచారం. సర్కార్ ఎక్స్ప్రెస్ బాపట్ల రైల్వేస్టేషన్ చేరుకోవడానికి ముందు పలు స్టేషన్లలో అనుమానాస్పదంగా రైలు ఎక్కిన వారి కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీపై దృష్టి సారించారు. సోమవారం రాత్రి రెండు బృందాలు ట్రాక్ వెంబడి గస్తీ చేపట్టాయి.