వాణిజ్య పన్నుల శాఖకు వెన్నంటే ఉంటాం
ABN , Publish Date - May 11 , 2026 | 04:16 AM
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీజీవో సంఘం ఎల్లప్పుడూ అండ గా నిలుస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు.
ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం
ఏపీ ఎన్జీజీవో అధ్యక్షుడు విద్యాసాగర్
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీజీవో సంఘం ఎల్లప్పుడూ అండ గా నిలుస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు. కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ బాబు అధ్యక్షతన ఆదివారం విజయవాడలో గాంధీనగర్ ఏపీ ఎన్జీవో హోంలో జరిగింది. ఇందులో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల డిమాండ్లపై చర్చ జరిగింది. ఇటీవల జూనియర్ అసిస్టెంట్ నుంచి జీఎ్సటీవో వరకు 100కుపైగా పదోన్నతులు కల్పించినందుకు చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆఫీస్ సబార్డినేట్స్కు జూనియర్ అసిస్టెంట్ పదోన్నతులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఇవ్వడం కోసం చీఫ్ కమిషనర్ అర్హుల వివరాలు పంపాలని జేసీలను కోరడాన్ని సంఘం స్వాగతించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి విద్యాసాగర్ మాట్లాడుతూ.. వేతన సవరణ కమిషన్ నియామకానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సంఘం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.