రేపటికి రుతుపవనాల్లో పురోగతి
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:25 AM
ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, రాయలసీమలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి.
నేడు కోస్తా, సీమలకు భారీ వర్షసూచన
విశాఖపట్నం, అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, రాయలసీమలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల మేఘాలు ఆవరించాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఇదే క్రమంలో సోమవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 23 నాటికి రుతుపవనాల పురోగతి ఉంటుందని అంచనా వాతావరణ శాఖ వేసింది.