సబ్స్టేషన్ల నిర్మాణంలో వేగం పెంచండి
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:41 AM
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్తు సబ్స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు.
విద్యుత్ అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్తు సబ్స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో విద్యుత్తు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్తు అంతరాయాలు, లోవోల్టేజీ సమస్యల పరిష్కారానికి కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. అత్యవసర సేవల విభాగాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్తు సరఫరా అందించేందుకు భూగర్భ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్తు అంతరాయాల వల్ల రోగులు ఇబ్బందులు పడకుండా నిరంతర విద్యుత్తు సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సుమారు 30 ప్రధాన ఆసుపత్రుల్లో జనరేటర్ల పనితీరును సమీక్షించి, కరెంటు నిలిచిపోయిన సమయంలో స్విచ్ ఓవర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్తు శాఖ చేపడుతున్న అన్ని అభివృద్ధి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్తు అంతరాయాల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.