దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు
ABN , Publish Date - May 27 , 2026 | 05:58 AM
మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.
మెగా డీఎస్సీ పూర్తి పారదర్శకం.. పాఠశాల విద్యాశాఖ
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది మెగా డీఎస్సీ పూర్తి పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. అయితే కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికలు, కొందరు వ్యక్తులు కావాలనే నిరాధారమైన విషయాలను ప్రచారం చేస్తున్నారన్నారు. హారిజంటల్ రిజర్వేషన్ అమలు తీరును కనీసం అర్థం చేసుకోకుండా... ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, మెరిట్ జాబితాలు ప్రకటించలేదని, అక్రమంగా ఎంపికలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారన్నారు. మెగా డీఎస్సీలో మెరిట్, ఎంపిక జాబితాలు అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేసిన మీడియా, సోషల్ మీడియా, వ్యక్తులకు పరువు నష్టం నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. సమాజంలో గందరగోళం సృష్టిస్తున్న కారణంతో కొందరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నామన్నారు.