ఔషధ మొక్కల బోర్డు సీఈవోకు అంతర్జాతీయ అవార్డు
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:43 AM
ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు సీఈవో, రాష్ట్ర అటవీశాఖ సీనియర్ అధికారి ఆవుల చంద్రశేఖర్ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు.
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు సీఈవో, రాష్ట్ర అటవీశాఖ సీనియర్ అధికారి ఆవుల చంద్రశేఖర్ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. లండన్లోని బ్రిటన్ పార్లమెంట్ హాలులో శుక్రవారం జరిగిన ప్రత్యేక సభలో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ‘భారతీయ ఆయుర్వేద శాస్త్రం- వ్యవసాయ సాంకేతికత’ శీర్షికతో ఆయన 50 పరిశోధనా గ్రంథాలను స్వల్పకాలంలోనే వెలువరించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ చంద్రశేఖర్ కృషిని గుర్తించి, అవార్డుకు ఎంపిక చేసింది. ‘ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ అండ్ అగ్రి టెక్నాలజీ’ శీర్షికతో 44 వ్యాధులకు సంబంధించిన 729 ఔషధ మొక్కలు, నివారణలతో కూడిన 50 పుస్తకాలను పూర్తి చేయడం ఒక ముఖ్యమైన రికార్డుగా లండన్ సంస్థ ప్రశంసించింది. అంతర్జాతీయ అవార్డు దక్కడం పట్ల పలువురు ప్రముఖులు చంద్రశేఖర్ను ప్రత్యేకంగా అభినందించారు.