AP Medical Council: 20 ఏళ్ల తరువాత వైద్య మండలికి ఎన్నికలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:24 AM
ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి(ఏపీఎంసీ) సభ్యుల ఎంపిక కోసం ఫిబ్రవరి 9న ఆన్లైన్ ద్వారా ఎన్నికలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్...
20 నుంచి నామినేషన్ల స్వీకరణ.. అర్హులైన ఓటర్ల సంఖ్య 55,504
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి(ఏపీఎంసీ) సభ్యుల ఎంపిక కోసం ఫిబ్రవరి 9న ఆన్లైన్ ద్వారా ఎన్నికలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఏపీఎంసీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చక్రధరబాబు వెల్లడించారు. ఏపీఎంసీ చట్టంలో నిర్దేశించిన 13 మంది సభ్యుల ఎంపిక కోసం సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని డీఎస్హెచ్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘హైకోర్టు ఆదేశాలను అనుసరించి 20 ఏళ్ల తర్వాత వైద్య మండలిలో సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఈ ఎన్నికల్లో 55,504 మంది వైద్యులకు ఓటు హక్కు ఉంది. మండలిలో సభ్యత్వం కలిగిన 55,504 మందిలో ఐదేళ్లపైబడి ఏపీలో ఉంటున్న వారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. మంగళవారం నుంచి 26 వరకూ నామినేషన్లు స్వీకరిస్తాం. ఫిబ్రవరి 2న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాం. ఫిబ్రవరి 9న ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆన్లైన్లో ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన మరుసటి రోజు కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తాం. ఏపీఎంసీలో చురుకుగా ఉన్న సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది’ అని చక్రధరబాబు తెలిపారు.