ఏపీ మద్యం కేసులో సిట్దే విచక్షణాధికారం
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:04 AM
ఏపీ మద్యం స్కాం కేసు దర్యాప్తులో సిట్ దే విచక్షణాధికారమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇది రూ.3500 కోట్ల అతిపెద్ద కుంభకోణమని గుర్తు చేసింది.
దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేయాలో కోర్టులు నిర్దేశించలేవు: సుప్రీం
న్యూఢిల్లీ, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం స్కాం కేసు దర్యాప్తులో సిట్ దే విచక్షణాధికారమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇది రూ.3500 కోట్ల అతిపెద్ద కుంభకోణమని గుర్తు చేసింది. భారీ అవినీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అనుసరించే వ్యూహాల్లో న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకోలేవని తేల్చిచెప్పింది. ప్రధాన నిందితులను పట్టుకునేందుకు, మూలాలను ఛేదించేందుకు కొందరు నిందితుల పట్ల ఉదారంగా వ్యవహరించడం, వారిని అప్రూవర్లుగా మార్చుకోవ డం పూర్తిగా ప్రాసిక్యూషన్, దర్యాప్తు సంస్థల విచక్షణాధికారమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడైన దొడ్డ వెంకట సత్యప్రసాద్(ఏ3)కు దిగువ కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ దాసరి సువర్ణరా జు దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ‘కేసులో రాష్ట్ర ప్రభుత్వం, సిట్ ఒక్క ఏ3 సత్యప్రసాద్ విషయంలో ఔదార్యం చూపి.. కావాలనే నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ను వెంటనే రద్దు చే యాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పిటిషనర్ సువర్ణరాజుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితుడి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరే చట్టపరమైన అర్హత లేదంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.