జయమంగళం రాజీనామాను తిరస్కరించిన మండలి చైర్మన్
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:49 AM
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు గురువారం తిరస్కరించారు.
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు గురువారం తిరస్కరించారు. వెంకటరమణ 2023 మార్చిలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 నవంబరులో జయమంగళం పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన జనసేనలో కొనసాగుతున్నారు. తన రాజీనామాను తక్షణం ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల మొదటివారంలో ఆ పిటిషన్ విచారణకు రావడంతో ప్రభుత్వ న్యాయవాది... మూడు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన గడువు ముగియనుండటంతో మండలి చైర్మన్ నిర్ణయాన్ని వెల్లడించారు. రాజీనామా కారణాన్ని తెలియజేస్తూ జయమంగళం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేనందున రాజీనామా తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.