రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమల్లో హడావుడి వద్దు
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:15 AM
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమల్లో హడావుడి వద్దని, ఉద్యోగుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు..
ఉద్యోగుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించాలి: బొప్పరాజు
విజయవాడ(గాంధీనగర్), జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమల్లో హడావుడి వద్దని, ఉద్యోగుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ప్రభుత్వాన్ని కోరారు. జేఏసీ సభ్య సంఘాల ప్రతినిధుల బృందం సీఎస్ జి.సాయిప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (జీఏడీ) రావత్ను శనివారం కలిసి పలు కీలక సూచనలు, విజ్ఞప్తులను లిఖితపూర్వకంగా అందజేశారు. రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, మున్సిపల్, కో-ఆపరేటివ్, లేబర్తో పాటు అనేక శాఖల్లో సాంకేతిక పరిపాలనా, న్యాయపరమైన కారణాలతో అన్ని కేడర్లలో పదోన్నతులు అనేక ఏళ్లుగా నిలిచిపోయాయని తెలిపారు. పెండింగ్ పదోన్నతులు పూర్తి చేసిన తర్వాతే రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేపట్టాలని కోరారు. జూలై 5 వరకు ఇచ్చిన పదోన్నతుల బ్యాన్ను ఈ ప్యానెల్ ఇయర్ పూర్తయ్యే ఆగస్టు 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.