ఇంటర్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:33 AM
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలను ఎలాంటి లోటుపాట్లూ లేకుండా అత్యంత పారదర్శకంగా...
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలను ఎలాంటి లోటుపాట్లూ లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,57,312 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారని శనివారం పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ తాగునీరు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు తగినంత గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రతి పరీక్ష గదిలో సీసీ కెమెరాలతోపాటు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లాస్థాయి పరీక్షా కమిటీలు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేశారు.