‘గొడ్డలి పార్టీ’ అని జనమే అంటున్నారు!
ABN , Publish Date - May 30 , 2026 | 03:57 AM
‘‘వైసీపీని గొడ్డలిపార్టీ అని మేం అనడమే కాదు. ప్రజలే అంటున్నారు. కొడవలి నుంచి కత్తికి వచ్చింది. కత్తి నుంచి గొడ్డలికి వచ్చింది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చరిత్రాత్మకం: అనిత
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీని గొడ్డలిపార్టీ అని మేం అనడమే కాదు. ప్రజలే అంటున్నారు. కొడవలి నుంచి కత్తికి వచ్చింది. కత్తి నుంచి గొడ్డలికి వచ్చింది. గొడ్డలిపార్టీ అని కాకుండా ఇంకేమంటారు’’ అని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళా సాధికారతకు కట్టుబడి పని చేస్తోందన్నారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా చట్టసభల్లో 33 శాతం టికెట్లు కేటాయించాలని మహానాడు వేదికగా తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇది ఒక సామాజిక విప్లవమని, రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక బ్లూప్రింట్ కాబోతోందని చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘మహిళలను కేవలం ఓటర్లుగానే కాకుండా, సమాజ నిర్మాణంలో కీలక భాగస్వాములు, నిర్ణయాధికారులు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో టీడీపీ పనిచేస్తోంది. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో సంబంధం లేకుండా రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున కేటాయించే సీట్లలో 33 శాతం మహిళలకే ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం చారిత్రాత్మకం. ఈ నిర్ణయం మహిళల రాజకీయ సాధికారతకు కొత్త దిశను నిర్దేశించింది’’ అని తెలిపారు.