బెయిల్ పిటిషన్లలో నేరచరిత్రను వెల్లడించాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:15 AM
రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసే బెయిల్ పిటిషన్లలో నిందితులు ఇకపై వారి నేర చరిత్రను వెల్లడించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
స్టాండింగ్ ఆర్డర్స్లో కొత్త నిబంధన చేర్చిన హైకోర్టు
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసే బెయిల్ పిటిషన్లలో నిందితులు ఇకపై వారి నేర చరిత్రను వెల్లడించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు ఏపీ హైకోర్టు స్టాండింగ్ ఆర్డర్స్ (రివైజ్డ్)-2004లో కొత్త నిబంధన చేరుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై దాఖలు చేసే ప్రతీ బెయిల్ అప్లికేషన్లో.. సుప్రీంకోర్టులో ఈ తరహా పిటిషన్ దాఖలు చేశారా.. లేదా? అనే విషయాన్ని పేర్కొనాలని, దాఖలు చేసి ఉంటే దాని ఫలితాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. పిటిషనర్పై గతంలో ఏమైనా నేరాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా చెప్పాలని, పూర్వ నేరచరిత్ర ఉంటే అందుకు సంబంధించిన వివరాలు, ఆ కేసులలో వచ్చిన తీర్పులను బెయిల్ అప్లికేషన్లో తెలియజేయాలని పేర్కొంది. అప్లికేషన్లో ఈ వివరాలు ప్రస్తావిస్తేనే పిటిషన్ను బెంచ్ ముందు ఉంచాలని స్పష్టతనిచ్చింది. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎ్సబీ పార్థసారథి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు.