సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవద్దు
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:49 AM
సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటూ.. క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను..
వైసీపీ నేత తమ్మినేని కుమారుడు చిరంజీవినాగు కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటూ.. క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత తమ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవినాగు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ... పిటిషనర్, ప్రతివాదిగా ఉన్న కట్టా విజయరాణికి మధ్య సివిల్ వివాదం నడుస్తున్నదన్నారు. ఇందుకు సంబంధించిన దావా సివిల్ కోర్టులో పెండింగ్లో ఉందన్నారు. క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పిటిషనర్ను పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది అజయ్ వాదనలు వినిపిస్తూ... విజయరాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.