‘ఎక్సలెన్సీ’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:20 AM
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడపబోతున్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించారు.
సంక్షేమ విద్యార్థులకు నీట్, జేఈఈకు ఉచిత శిక్షణ
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడపబోతున్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇంటిగ్రేటెడ్ ఐఐటీ/జేఈఈ, నీట్ కోచింగ్తో కూడిన ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఎంపీసీ/బైపీసీ కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి వి.ప్రసన్న వెంకటేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మేఘాద్రిగడ్డ, తాడికొండ, కోట అంబేద్కర్ గురుకుల కేంద్రాల్లో ఈ ఎక్సలెన్సీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఇంటర్మీడియట్ విద్యతో పాటు సమగ్రమైన ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్, వసతి, భోజనం, స్టడీ మెటీరియల్, ఇతర విద్యాపరమైన సహాయంతో కూడిన ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు 75 శాతం సీట్లు, ఇతర వర్గాల విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే రిజర్వేషన్ విధానం ప్రకారం ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 17 నుంచి వెబ్సైట్ http://apbrageet.apcfss.in. ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 30గా పేర్కొన్నారు.