ఏపీపీఎస్సీ ద్వారా 106 ఈవో పోస్టుల భర్తీ: మంత్రి ఆనం
ABN , Publish Date - May 22 , 2026 | 06:10 AM
రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో 106 ఈవో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
ఐరాల(కాణిపాకం), మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో 106 ఈవో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయకస్వామి ఆలయంలో వినాయక సదన్ వసతి గృహంపై రెండు, మూడు అంతస్తులను గురువారం ఆయన ప్రారంభించారు. ’కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆలయాలు అభివృద్ధి చెందాయి. రాష్ట్రవ్యాప్తంగా 52 ఆలయాల్లో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణను.. భవిష్యత్తులో 116 ఆలయాలకు విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ సహకారంతో శ్రీవాణి భజన మందిరాల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. గిరిజన తండాలు, దళితవాడల్లో భజన మందిరాలను నిర్మిస్తాం. గ్రామస్థుల అభీష్టం మేరకే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. గత 23 నెలల్లో కామన్ గుడ్ ఫండ్ కింద 691 ఆలయాలకు రూ.812.67 కోట్లతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టాం’ అని మంత్రి తెలిపారు.