‘భోజనం’లో రాగిజావ మరో మూడేళ్లు
ABN , Publish Date - May 05 , 2026 | 05:39 AM
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అదనపు పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం శ్రీ సత్యసాయి...
లోకేశ్ సమక్షంలో శ్రీసత్యసాయి ట్రస్ట్తో ఒప్పందం
అమరావతి, పుట్టపర్తి, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అదనపు పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో అమలు చేస్తున్న రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2026-29 కాలానికి విద్యార్థులకు రాగిజావ పంపిణీని కొనసాగించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్తో విద్యాశాఖ ఎంవోయూ (అవగాహన ఒప్పందం) కుదుర్చుకుంది. ట్రస్ట్ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు రాగి జావ పంపిణీని 2023, మార్చిలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 44 వేల పాఠశాలల్లో దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు రాగిజావ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అడ్మిన్ కో-ఆర్డినేటర్ ఎస్.జి.చలం, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఏపీ విభాగం అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావుతోపాటు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.