Share News

ప్రభుత్వ పాఠశాలల్లో సిక్‌ రూమ్‌లు

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:10 AM

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం సిక్‌ రూమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యార్థులు ఆకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా, ఏవైనా అనుకోని గాయాలైనా ప్రథమ చికిత్స అందజేసేందుకు..

ప్రభుత్వ పాఠశాలల్లో సిక్‌ రూమ్‌లు

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం సిక్‌ రూమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యార్థులు ఆకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా, ఏవైనా అనుకోని గాయాలైనా ప్రథమ చికిత్స అందజేసేందుకు ఈ సిక్‌ రూమ్‌లు ఉపయోగపడతాయని సమగ్రశిక్ష అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 629 పీఎంశ్రీ పాఠశాలల్లో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.5లక్షల బడ్జెట్‌ కేటాయించారు. మొత్తంగా సుమారు రూ.30కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లోని ఒక గదిని కేటాయించి ఆస్పత్రి తరహా బెడ్‌తోపాటు ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతారు. స్థానిక ఏఎన్‌ఎం సేవలు అందించేలా చూడనున్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే సిక్‌రూమ్‌లకు అవసరమైన సామగ్రి సరఫరా చేశారు. నెలరోజుల్లో వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 04:11 AM