జర్నలిస్టులకు అవార్డులు
ABN , Publish Date - May 14 , 2026 | 05:06 AM
జర్నలిస్టుల ప్రతిభను గుర్తిస్తూ 2025-26 సంవత్సరానికి ఉత్తమ జర్నలిస్టు అవార్డులను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని సీఆర్ మీడియా ...
ఎంపిక కోసం నలుగురితో కమిటీ..
లైఫ్ టైమ్ అచీవ్మెంట్కు 3 లక్షలు, ఉత్తమ పాత్రికేయునికి 2 లక్షలు నగదు
ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేశ్ కుమార్, ఐఅండ్పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్
విజయవాడ, మే 13(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల ప్రతిభను గుర్తిస్తూ 2025-26 సంవత్సరానికి ఉత్తమ జర్నలిస్టు అవార్డులను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. విజయవాడలోని అకాడమీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మొత్తం 12 కేటగిరీల్లో జర్నలిస్టులకు అవార్డులను ప్రకటిస్తాం. అవార్డుల ఎంపిక కోసం... ఇండియా టుడే మాజీ ఎడిటర్ ఏఏవీ ప్రసాద్, ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ డీవీఆర్ మూర్తి, విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సత్యన్నారాయణ మూర్తి సభ్యులుగా, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎ్స.విశ్వనాథన్ మెంబర్గా కమిటీని ఏర్పాటు చేశాం. లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డు, ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు కమిటీ పరిశీలించి డైరెక్ట్గా నామినేట్ చేస్తుంది. మిగిలిన అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు గ్రహీతకు రూ.3 లక్షలు, ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు రూ.2 లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నాం. మిగతా విభాగాల్లో ఎంపికయ్యే వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున నగదు పురస్కారం అందజేస్తాం. అక్రిడేషన్తో సంబంధం లేకుండా అనుభవం ఉన్న జర్నలిస్టులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు’ అని సురేశ్ కుమార్ తెలిపారు. ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కె.ఎ్స.విశ్వనాథన్ మాట్లాడుతూ... 2012లో ఈ అవార్డుల విధానం ఖరారయిందని, చివరిసారిగా 2017లో అవార్డులు ప్రదానం చేశారని తెలిపారు.