భారీ పరిశ్రమలకు భూ యాజమాన్య హక్కులు
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:12 AM
పరిశ్రమలకు లీజు విధానంలో భూములు కేటాయించే విధానంలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది.
‘అవుట్రైట్ సేల్’ విధానంలో భూముల విక్రయం
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలకు లీజు విధానంలో భూములు కేటాయించే విధానంలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. పారిశ్రామిక పార్కులు, బల్క్, భారీ పరిశ్రమలకు 100 శాతం భూ యాజమాన్య హక్కులను కల్పించేలా ‘అవుట్రైట్ సేల్’ విధానం అమలు చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)ని ఆదేశిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భారీ పరిశ్రమలకు కేటాయించిన భూములను ఫ్రీహోల్డ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్కులర్ ఎకానమీ సెక్టార్, డ్రోన్ తయారీ రంగం, బల్క్ డ్రగ్ పార్కులు, సంబంధిత పరిశ్రమలకు భూమిని స్వేచ్ఛగా వాడుకునేలా అమ్మాలని ఏపీఐఐసీకి సూచించారు. అవుట్రైట్ సేల్ విధానంతో పాటు పరిశ్రమలకు లీజులకు భూ కేటాయింపులు చేసినప్పుడు కూడా ఫ్రీహోల్డ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించే వీలుందని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి.