సీఎంకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:11 AM
క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయాలను వారు స్వాగతించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఏపీఎన్జీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జీ రామకృష్ణ, ఎన్ ప్రసాద్ సీపీఎస్, పీఎస్యూ ఉద్యోగుల సంఘం నేతలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.