నేడు ఎడ్సెట్
ABN , Publish Date - May 08 , 2026 | 04:50 AM
ద్రావిడ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్సెట్-2026) నిర్వహించనున్నారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కుప్పం, మే 7 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్సెట్-2026) నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు రెండు విడతలుగా ఈ పరీక్ష జరుగుతుందని ఎడ్సెట్ కన్వీనర్ ఆచార్య డి.శ్రీనివాసకుమార్ తెలిపారు. 24,628 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 22,085 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని స్పష్టంచేశారు. ముందుగా రావడం ద్వారా ఆన్లైన్ పరీక్ష విధానాన్ని తెలుసుకోవచ్చన్నారు. హాల్ టికెట్లను మరెవరికీ బదిలీ చేయకూడదన్నారు. హాల్ టికెట్లో మార్పులు చేస్తే అభ్యర్థి అర్హత రద్దు చేస్తామన్నారు. పుస్తకాలు, కాలిక్యులేటర్లు, డాక్యుపెన్, స్లైడ్ రూల్స్, లాగ్ టేబుల్స్, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని తెలిపారు.