Share News

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ నేడు

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:13 AM

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలును ఉన్నత విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం గురువారం ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు..

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌  నోటిఫికేషన్‌ నేడు

  • 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • 25 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు

  • ఆగస్టు 6న సీట్ల కేటాయింపు

  • ఈఏపీసెట్‌ షెడ్యూలు విడుదల

  • డిజిటల్‌ సంస్కరణలు భేష్‌: కేంద్రం

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలును ఉన్నత విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం గురువారం ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఈ నెల 20 నుంచి 29 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 22 నుంచి 31 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. 25 నుంచి 31 వరకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆగస్టు 1న ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఇచ్చారు. 6న ఉన్నత విద్యాశాఖ సీట్లు కేటాయించనుంది. 7 నుంచి 13 వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేసి అడ్మిషన్లను ధ్రువీకరించుకోవాలి. ఆగస్టు 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కాగా, ఈ ఏడాది నుంచి ఇంజనీరింగ్‌ కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. గతేడాది వరకు కనీస ఫీజు రూ.40 వేలు ఉంటే దానిని రూ.47 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనీస ఫీజు కాకుండా అంతకంటే ఎక్కువ ఫీజులుంటే అవే ఫీజులతో కౌన్సెలింగ్‌ చేపడతారు. అయితే, ఉన్నత విద్య కమిషన్‌ తుది ఫీజులకు లోబడి ఉండాలనే నిబంధన అమలు చేస్తారు. మరోవైపు త్వరలోనే ఉన్నత విద్య ఫీజుల కమిటీ రెండు, మూడు నెలల్లో కొత్త ఫీజులను ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. నూతన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేయగానే అమల్లోకి వస్తాయి. ఈ ఏడాది 1,82,317మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ స్ర్టీమ్‌లో(ఈఏపీసెట్‌) అర్హత సాధించారు.


రెండో విడత ర్యాంకుల కేటాయింపు

కాకినాడ (జేఎన్టీయూకే), జూలై 15(ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీసెట్‌-2026కు సంబంధించి ఇప్పటివరకూ ర్యాంకులు పొందకుండా ఉండి 10+2 గ్రూప్‌ మార్కులను డిక్లరేషన్‌ ఫారంలో అప్‌లోడ్‌ చేసిన ఇంటర్‌, ఇతర బోర్డుల విద్యార్థులకు ర్యాంకులు కేటాయించినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.మోహన్‌రావు తెలిపారు. ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి ఏపీ, తెలంగాణ ఇంటర్‌ బోర్డులు కాకుండా అందుబాటులో లేని ఐసీఎ్‌సఈ, సీబీఎ్‌సఈ, ఏపీవో ఎస్‌ఎస్‌, ఎన్‌ఐవోఎస్‌, ఆర్జీయూకేటీ, డిప్లొమా ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులకు మంగళవారం ర్యాంకులు కేటాయించామన్నారు. అయితే అగ్రికల్చర్‌ ఫార్మసీ విద్యార్థులకు త్వరలోనే ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. విద్యార్థులు తమ ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌, ఈఏపీసెట్‌ అప్‌డేట్స్‌ కోసం https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కన్వీనర్‌ సూచించారు.

Updated Date - Jul 16 , 2026 | 05:15 AM