Share News

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ABN , Publish Date - May 12 , 2026 | 05:43 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌-2026 పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

  • నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్‌..

  • 23న ప్రాథమిక కీ.. జూన్‌ 1న ఫలితాలు: చైర్మన్‌ సీఎస్ఆర్కే ప్రసాద్‌

జేఎన్టీయూకే, మే 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌-2026 పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మే 12 నుంచి 20 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఈఏపీసెట్‌ చైర్మన్‌, జేఎన్‌టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్‌ తెలిపారు. ఉదయం సెషన్‌ 9 గంటల కు, మధ్యాహ్నం సెషన్‌ 2 గంటలకు ప్రారంభమవుతాయని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరన్నారు. ఈ పరీక్షలకు ఇంజనీరింగ్‌ విభాగంలో 2,75,794 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 78,421 మంది, రెండు విభాగాలకూ కలిపి 792 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మే 12, 13, 14, 15, 18 వరకూ 10 సెషన్లలో(ఉదయం, మధ్యాహ్నం), అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో మే 19, 20 తేదీల్లో నాలుగు సెషన్ల(ఉదయం, మధ్యాహ్నం)లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఏపీ, హైదరాబాద్‌ల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెల 23న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, 25 వరకూ దానిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. జూన్‌ 1న తుది ఫలితాలు వెల్లడిస్తామన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయని ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.మోహన్‌రావు తెలిపారు. ఈఏపీసెట్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం 0884-2359599, 2342499 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌ టికెట్‌, ఆధార్‌ లేదా ఏదైనా ఐడీ ప్రూఫ్‌ తీసుకువెళ్లాలని చెప్పారు.

Updated Date - May 12 , 2026 | 05:43 AM