రాష్ట్రానికి రెండు ఆడ పులులు
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:51 AM
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో డిప్యూటీ సీఎం పవన్ చర్చలు
తూర్పు కనుమలకు ఇచ్చేందుకు మహారాష్ట్ర అంగీకారం
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముంబైలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఏపీకి రెండు ఆడ పులులు ఇచ్చేవిషయమై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి, భవిష్యత్లో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ ‘ఏపీలోని తూర్పు కనుమలలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర సహకారం తీసుకుంటున్నాం. ఏపీకి రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సీఎం ఫడ్నవీస్కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. దీనికి సహకరించిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని అన్నారు.