నేతల అవినీతి తుడిచే యంత్రం బీజేపీ దగ్గరుందా?
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:31 AM
అవినీతి మరకలున్న నేతలు బీజేపీలో చేరగానే సచ్ఛీలురైపోతున్నారెందుకని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ నిలదీశారు.
కేంద్రమంత్రి నిర్మలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ప్రశ్న
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): అవినీతి మరకలున్న నేతలు బీజేపీలో చేరగానే సచ్ఛీలురైపోతున్నారెందుకని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ నిలదీశారు. బీజేపీలో చేరిన వెంటనే నేతల అవినీతి మరకలు తుడిచేసే వాషింగ్మెషిన్ ఏదైనా ఆ పార్టీ దగ్గర ఉందా అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. విజయవాడలోని ఆంద్రరత్న భవన్లో శనివారం మస్తాన్వలీ మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు గడచిన పన్నెండేళ్లలో యువతకు ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇచ్చిందో గణాంకాలతో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతమందికి స్వయం ఉపాధి కోసం రుణాలు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. కార్పొరేట్ సంస్థలు బ్యాంకు రుణాలను ఎగవేస్తుంటే.. కఠిన చర్యలు తీసుకోవడంలేదు ఎందుకని అంటూ మస్తాన్ వలీ మండిపడ్డారు. ఎన్నికల బాండ్ల ద్వారా భారీగా నిధులు సమీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడడంలేదా అని ప్రశ్నించారు.