మళ్లీ అవే సమాధానాలు
ABN , Publish Date - May 08 , 2026 | 05:57 AM
వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్రెడ్డిని అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు రెండోసారి విచారించారు. డీఎస్పీ పావని ఆధ్వర్యంలో...
మదనపల్లెలో సజ్జల భార్గవ్ విచారణ
140 ప్రశ్నలు సంధించిన పోలీసులు
మదనపల్లె, మే 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్రెడ్డిని అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు రెండోసారి విచారించారు. డీఎస్పీ పావని ఆధ్వర్యంలో బి.కొత్తకోట, ములకలచెరువు సీఐలు గోపాల్రెడ్డి, దస్తగిరి గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:45 గంటల వరకూ స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 140 ప్రశ్నలు అడగగా.. అన్నింటికీ తెలీదు, గుర్తులేదు అని మళ్లీ పాత సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. సీఎం సతీమణి భువనేశ్వరి, హోం మంత్రి అనితలపై పెట్టిన అసభ్యకర పోస్టులకు సంబంధించి భార్గవ్రెడ్డిపై 2024లో బి.కొత్తకోటలో కేసు నమోదైంది. దీనిపై ఏప్రిల్ 26న విచారణకు హాజరైన భార్గవ్రెడ్డిని, అదే రోజు మదనపల్లెకు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. 2022 నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ఫోన్లు మార్చారు? ఎన్ని సిమ్లు ఉపయోగించారు? ఎన్ని సోషల్ మీడియా ఖాతాలు ఉపయోగించారు? అవి ఎవరివి? మీవేనా? లేక నకిలీ ఖాతాలా? జగతి పబ్లికేషన్కు, మీకూ ఏంటి సంబంధం? తదితర ప్రశ్నలు సంధించారు. వీటికి ఆయన తెలీదు.. ఏమో గుర్తు లేదు.. అనే సమాధానాలు చెప్పినట్లు తెలిసింది.