నేడు అరకులోయకు సీఎం
ABN , Publish Date - Aug 29 , 2026 | 06:09 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటించనున్నారు.
గన్నెల పీహెచ్సీలో ‘సంజీవని’ ప్రారంభోత్సవం
పాడేరు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటించనున్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన ‘సంజీవని ప్రాజెక్టును మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ప్రారంభించనున్నారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి ఉదయం పది గంటలకు అరకులోయ మండలం గన్నెల గ్రామానికి చేరుకుంటారు. తొలుత సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకృష్ణానగర్లో ఓ గిరిజనుడి ఇంటిని సందర్శిస్తారు. అనంతరం గన్నెల పీహెచ్సీలో సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. కార్యక్రమం ముగిసిన అనంతరం హెలికాప్టర్లో నేరుగా ఉండవల్లి పయనమవుతారు.