అంతర్జాతీయ సదస్సులో నేడు చంద్రబాబు కీలక ప్రసంగం
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:57 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. శనివారం ఉదయం 10.50కి అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరతారు.
ఢిల్లీలో ప్రఖ్యాత రైసినా డైలాగ్లో సాంకేతికత-సుపరిపాలనపై సీఎం ఉపన్యాసం
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. శనివారం ఉదయం 10.50కి అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు భారత్ మండపంలో జరిగే ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో ఫిన్లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ- అబ్జర్వర్ రీసెర్చి ఫౌండేషన్ (ఎంఓఈఏ -ఓఆర్ఎఫ్) 2016 నుంచి రైసినా డైలాగ్ పేరుతో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో సాంకేతికత-సుపరిపాలన- భవిష్యత్తు అనే అంశంపై చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాల ద్వారా ప్రజలకు అందుతున్న మెరుగైన పౌరసేవల గురించి ఈ సదస్సులో ప్రస్తావిస్తారు.