ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచండి
ABN , Publish Date - May 19 , 2026 | 04:16 AM
ఇంధన పొదుపు కోసం.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చేలా..
ఈఎంఐ విధానంలో ఈ- సైకిళ్లు ఇవ్వండి
స్వర్ణ గ్రామ.. వార్డులకు సరఫరా చేయండి
చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయండి
ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది
ఈవీ కంపెనీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపు కోసం.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆ కార్యాలయాల సిబ్బందికి అందించాలన్నారు. ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేందుకు రుణాలు ఇవ్వాలని, దీని కోసం ప్రత్యేక ఎస్పీవీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈఎంఐ విధానంలో ఈవీ సైకిళ్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు చార్జింగ్ స్టేషన్ల లాంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలన్నారు. చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు.