కంపెనీలకు భూముల కేటాయింపు
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:35 AM
విశాఖపట్నంలో అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ భారీ పెట్టుబడులతో చేపడుతున్న ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుల అభివృద్ధికి అవసరమైన భూ కేటాయింపులు..
పరిశ్రమల శాఖ ఉత్తర్వులు
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ భారీ పెట్టుబడులతో చేపడుతున్న ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుల అభివృద్ధికి అవసరమైన భూ కేటాయింపులు, సేల్ అగ్రిమెంట్ మార్పులు, జీవీఎంసీ భూమిని లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పాటు పలు సంస్థలకు భూములు కేటాయించారు. కర్నూలు జిల్లా గుట్టపాడులో ఎకరా రూ. 10 లక్షల చొప్పున అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు 143.26 ఎకరాలు ఇచ్చారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు శ్రీకాకుళం జిల్లా మూలపేటలో 450 ఎకరాల భూమిని కేటాయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా కనమాం గ్రామంలో ఎకరా రూ. 55 లక్షల చొప్పున 15 ఎకరాల భూమిని ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ఉక్కు కర్మాగారాన్ని ఈ నెలలో ప్రారంభించాల్సి ఉండగా.. ఆ గడువు డిసెంబరు వరకు పొడిగించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు, పైడాపురం గ్రామాల్లో 680.55 ఎకరాలకు సంబంధించి సెయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుకూలంగా సేల్డీడ్ రిజిస్ట్రేషన్కు ఆమోదం తెలిపారు. నెల్లూరు జిల్లా వడ్లపూడిలో ఇండస్ట్రియల్ అండ్ వేర్హౌసింగ్ పార్క్ ఏర్పాటుకు 372 ఎకరాలు కేటాయించారు.