సెల్ సిగ్నల్ పోకూడదు
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:44 AM
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలతో పాటు ప్రతి మారుమూల ప్రాంతానికి కమ్యూనికేషన్ కనెక్టివిటీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కమ్యూనికేషన్ నెట్వర్క్పై సమీక్షలో సీఎం
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలతో పాటు ప్రతి మారుమూల ప్రాంతానికి కమ్యూనికేషన్ కనెక్టివిటీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ సెల్ కనెక్టివిటీ ఉండాల్సిందేనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా సమాచార వ్యవస్థలో లాస్ట్ మైలు కనెక్టివిటీ దిశగా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కమ్యూనికేషన్ ప్రొవైడర్లను ఆదేశించారు. బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కమ్యూనికేషన్ నెట్వర్క్పై సమీక్షించారు. మొబైల్ఫోన్ నెట్వర్క్ కవరేజీ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చోట్ల సెల్టవర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో 30,694 సెల్టవర్లు ఉన్నాయని మరో 2,310 టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ, కమ్యూనికేషన్స్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వివరించారు. ఏపీ వ్యాప్తంగా 1,69,638 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్తో పాటు 28.57 లక్షల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. సెల్టవర్ల ఏర్పాటులో ప్రొవైడర్లకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. రాజధాని అమరావతిలో ఎక్కడా తవ్వకాలు లేకుండా ఫైబర్ ద్వారా సమాచార నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. డిజిటల్ లిటరసీకి సహకరిస్తామని.. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్కు ప్రాధాన్యం ఇస్తూ మొబైల్ ఫోన్ ద్వారా పౌర సేవలు సులువుగా అందిస్తున్నామని సీఎం చెప్పారు.