సముద్ర తీరం వెంబడి తాటిచెట్లు
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:44 AM
రాష్ట్రంలోని వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం వెంబడి తాటిచెట్లు నాటాలని సంకల్పించినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
సముద్రతీర రక్షణ, ఆయా వర్గాలకు ఉపాధి లక్ష్యం: మాధవ్
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం వెంబడి తాటిచెట్లు నాటాలని సంకల్పించినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన బీజేవైఎం రాష్ట్ర స్థాయి సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ.. తుఫాన్ల నుంచి రక్షణ, సముద్రతీరం కోతకు అడ్డుకట్ట, తాటి చెట్టును నమ్ముకుని జీవించే వర్గాలకు ఉపాధి అనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇక.. దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని మాధవ్ పిలుపునిచ్చారు. ‘నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకెళుతోంది.. ఆ దిశగా యువతను సమీకరించాల్సిన బాధ్యత బీజేవైఎంపై ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇవన్నీ ప్రజలకు వివరించాలి’ అని అన్నారు.