వెనుకబడిన తరగతులపై అధ్యయనం
ABN , Publish Date - Apr 01 , 2026 | 06:19 AM
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ ‘ట్రిపుల్ టెస్ట్’కు సంబంధించిన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
మాజీ ఐఏఎస్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ ప్రారంభం
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ ‘ట్రిపుల్ టెస్ట్’కు సంబంధించిన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్లో నిపుణులు, అధికారులను నియమించారు. ఈ కమిషన్ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల స్థితిగతులను పరిశీలించి, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, అవకాశాలు, వనరుల వినియోగంపై విశ్లేషణ చేయనుంది. అలాగే, ఆయా వర్గాల విద్య, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయనుంది. ప్రజల నుంచి ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ప్రతినిధులు, ప్రజాసంఘాలు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రభుత్వం ఈ కమిషన్ ద్వారా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కార్యాచరణను రూపొందిస్తుంది.
సూచనలకు అవకాశం
డెడికేటెడ్ కమిషన్కు సంబంధించిన వివరాలను బీసీ కమిషన్ కార్యదర్శి చంద్రశేఖర్రాజు మంగళవారం తెలిపారు. ప్రజల వర్గీకరణను సమగ్రంగా పరిశీలించే ప్రక్రియలో భాగంగా డెడికేటెడ్ కమిషన్ పలువర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తుందని తెలిపారు. అభ్యంతరాలు లేదా వినతిపత్రాలను వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా ఏప్రిల్ 30 లోగా సమర్పించవచ్చని తెలిపారు. వివరాల కోసం 9010400500, 7989344521 ఫోనన్నంబర్లను సంప్రదించవచ్చని వివరించారు.