అసెంబ్లీ నిరవధిక వాయిదా
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:14 AM
శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం ప్రకటించారు. నాలుగు రోజుల పాటు సమావేశాలు కొనసాగాయని, మొత్తం..
12 బిల్లులకు ఆమోదం
103 మంది ప్రసంగాలు
కీలకమైన బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి ప్రకటన
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం ప్రకటించారు. నాలుగు రోజుల పాటు సమావేశాలు కొనసాగాయని, మొత్తం 25 గంటల 15 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. సభలో 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్నీ ఆమోదం పొందాయని తెలిపారు. 103 మంది సభ్యులు అసెంబ్లీలో ప్రసంగాలు చేశారని వివరించారు. మూడు లఘు చర్చలు జరగ్గా, 344వ నియమం కింద ఒక అంశంపై చర్చించినట్లు పేర్కొన్నారు. నక్షత్ర గుర్తు కలిగిన 40 ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానాలు ఇచ్చారని తెలిపారు. ఒక నక్షత్రం గుర్తు లేని ప్రశ్నతో పాటు 25 నక్షత్ర గుర్తు ప్రశ్నలను సభా సమక్షంలో ఉంచారన్నారు. శాసనమండలికి పంపిన ఆయా బిల్లులు ఎలాంటి సవరణ లేకుండా ఆమోదించినట్లు కౌన్సిల్ కార్యాలయం సమాచారం ఇచ్చిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సభలో ప్రకటించారు.