మార్చి 7 వరకు అసెంబ్లీ 17 పనిదినాలు సమావేశాల నిర్వహణ
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:44 AM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 పనిదినాలు సమావేశాలు నిర్వహించాలని బుధవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ)లో నిర్ణయించారు.
14న రాష్ట్ర బడ్జెట్.. 17, 18న దానిపై చర్చ
సభావ్యవహారాల సలహా సంఘం నిర్ణయం
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 పనిదినాలు సమావేశాలు నిర్వహించాలని బుధవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ)లో నిర్ణయించారు. శాసనసభ సమావేశాలను ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరపాలని నిర్ణయించారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాల మేరకు... ‘14న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. 15, 16 తేదీలు సెలవులు. 17, 18న బడ్జెట్పై చర్చ, 18న ఆర్థిక మంత్రి సమాధానం ఉంటాయి. 19 నుంచి 8 పనిదినాలు డిమాండ్లు, గ్రాంట్లుపై చర్చ ఉంటుంది. 28న శనివారం అయినా అసెంబ్లీ జరుగుతుంది. మార్చి 1, 2, 3 తేదీలు అసెంబ్లీకి సెలవులు. అవసరాన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని బీఏసీలో నిర్ణయించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు... గంటపాటు క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ తర్వాత అరగంటపాటు జీరో అవర్ నిర్వహించి అరగంట టీ బ్రేక్ ఇస్తారు. తిరిగి 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సమావేశాలు జరుగుతాయి. జీరో అవర్లో ప్రతి సభ్యుడూ 2 నిమిషాలు మాత్రమే మాట్లాడేలా చూడాలని విప్లకు సూచించారు. ఈసారి సారూప్యత కలిగిన శాఖలన్నింటిపైన ఒకే రోజు చర్చ జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం మొత్తం అన్ని శాఖలను 8 గ్రూపులుగా చేశారు. ప్రజాప్రతినిధులకు ఆటల పోటీలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో విజయవాడలో, మార్చి 6న ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలు రాజధాని అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తారు.’